కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాధారణ ప్రజలపై యెహోవా శ్రద్ధ చూపిస్తాడు

సాధారణ ప్రజలపై యెహోవా శ్రద్ధ చూపిస్తాడు

సాధారణ ప్రజలపై యెహోవా శ్రద్ధ చూపిస్తాడు

దేవుడు మనలను గమనించాలంటే మనం అసాధారణంగానో విశిష్ఠంగానో ఉండాలా? అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌, “ప్రభువుకు సాధారణ ప్రజలంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతమంది సాధారణ ప్రజలను సృష్టించాడు” అని అన్నట్లు నివేదించబడింది. చాలామంది తాము గమనార్హమైన అంశాలేవీ లేని సాధారణ ప్రజలమని భావిస్తారు. సాధారణ ప్రజలంటే “పేదవారు, కింది స్థాయికి చెందినవారు” అని సూచించబడే అవకాశం ఉంది. అదేవిధంగా, “సాధారణ” అనే పదం ఆధిక్యత లేదా ప్రత్యేకమైన హోదా లేకపోవడాన్ని, సాధారణ స్థాయికంటే కింది స్థాయిలో ఉండడాన్ని, లేదా ద్వితీయ శ్రేణిని కూడా సూచించవచ్చు. మీరు ఎలాంటి ప్రజల సమక్షంలో ఉండేందుకు ఇష్టపడతారు? పొగరుగా, మొండిగా, అహంకారంతో ఉండే వ్యక్తుల సమక్షంలో ఉండడానికి ఇష్టపడతారా? దానికి బదులుగా, ఇతరులపట్ల యథార్థమైన హృదయపూర్వక ఆసక్తి చూపిస్తూ స్నేహపూర్వకంగా, అణకువగా, నిరాడంబరంగా ఉండే వ్యక్తుల మధ్య ఉండడానికి మీరు ఇష్టపడరా?

నేటి లోకంలో భావోద్వేగపరమైన వేదన, అవహేళన సర్వసాధారణమైపోయాయి కాబట్టి దేవునికి తమపై వ్యక్తిగత ఆసక్తి ఉందని నమ్మడం కొంతమందికి కష్టమనిపిస్తుంది. “మా కుటుంబంలో ఎవ్వరూ ఒకరిపట్ల ఒకరు అంతగా ప్రేమను వ్యక్తం చేయరు. నన్ను అవమానించేవారు, విసిగించేవారు, అవహేళన చేసేవారు. కాబట్టి చిన్నప్పటి నుండే నేను ఎందుకూ పనికిరాని వ్యక్తినని భావించేవాడిని. గతంలో బలంగా నాటుకుపోయిన భావాలు నాలో ఇప్పటికీ ఉన్నాయి, అవి నేను కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు నన్ను ఎంతో నిరుత్సాహపరుస్తాయి” అని ఈ పత్రికా పాఠకుడు ఒకాయన వ్రాశాడు. అయినప్పటికీ, దేవునికి సాధారణ ప్రజలపై వ్యక్తిగత శ్రద్ధ ఉందని నమ్మడానికి కారణాలున్నాయి.

సాధారణ ప్రజలపై దేవునికున్న శ్రద్ధ

“యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది” అని దావీదు రాజు వ్రాశాడు. (కీర్తన 145:⁠3) అయితే యెహోవా ప్రేమపూర్వకంగా సానుభూతితో మనపై శ్రద్ధ చూపేందుకు ఆయన మహాత్మ్యము అడ్డురాదు. (1 పేతురు 5:⁠7) ఉదాహరణకు, “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని కీర్తనకర్త నివేదించాడు.​—⁠కీర్తన 34:18.

ఈ లోకంలోని ప్రజల అవధానాన్ని ఆకర్షించే శారీరక సౌందర్యం, హోదా లేదా ధనం వంటివాటిని దేవుడు ప్రాముఖ్యమైనవిగా పరిగణించడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము, పేదలు, అనాథలు, విధవరాండ్రు, పరదేశుల విషయంలో ఆయనకున్న దయాపూర్వకమైన శ్రద్ధను చూపించింది. ఐగుప్తులో క్రూరంగా హింసించబడిన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇలా చెప్పాడు: “పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; . . . విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.” (నిర్గమకాండము 22:​21-23) అంతేకాకుండా దేవుడు పేదవారిపై శ్రద్ధ చూపుతాడనే విషయంలో తన నమ్మకాన్ని యెషయా ప్రవక్త ఇలా వ్యక్తం చేశాడు: “భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగులకుండ నీడగాను ఉంటివి.”​—⁠యెషయా 25:⁠3.

దేవుని “మూర్తిమంతము” అయిన యేసుక్రీస్తు తన పరిచర్య కాలమంతటిలో సాధారణ ప్రజలపై యథార్థమైన శ్రద్ధ చూపే విషయంలో తన శిష్యులకు మాదిరినుంచాడు. (హెబ్రీయులు 1:⁠3, 4) “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” జన సమూహాలను చూసి యేసు “వారిమీద కనికరప[డ్డాడు.]”​—⁠మత్తయి 9:36.

యేసు ఎలాంటి వ్యక్తులను తన అపొస్తలులుగా ఎంపిక చేసుకున్నాడనే విషయాన్ని కూడా గమనించండి, “విద్యలేని పామరు[లు]” అని వర్ణించబడిన వారిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 4:​13) యేసు మరణం తర్వాత, ఆయన అనుచరులు దేవుని వాక్యాన్ని వినడానికి అన్ని రకాల ప్రజలను ఆహ్వానించడం ప్రారంభించారు. “అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను” క్రైస్తవ సంఘానికి వచ్చి విశ్వాసిగా మారవచ్చని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 14:​24, 25) లోకసంబంధమైన ప్రమాణాల ప్రకారం అభిమానించబడే ప్రజలను మాత్రమే ఎంపిక చేసుకొనే బదులు దేవుడు ఎంతోమంది దీనులైన సాధారణ ప్రజలను తన సేవ చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. “సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.​—⁠1 కొరింథీయులు 1:26-29.

అదేవిధంగా నేడు దేవునికి మనపై యథార్థమైన ఆసక్తి ఉంది. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె[ను]” అనేది దేవుని చిత్తం. (1 తిమోతి 2:⁠4) మనకోసం చనిపోయేందుకు తన అద్వితీయ కుమారుణ్ణి పంపించేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలను ఎవ్వరూ ప్రేమించరనీ మనం దేనికీ పనికిరాని వారమనీ భావించడానికి మనకు ఎలాంటి కారణమూ లేదు. (యోహాను 3:​16) వారు ఆయన ఆధ్యాత్మిక సహోదరులలో అత్యంత అల్పుడైన సహోదరుడితో వ్యవహరిస్తున్నప్పుడు కూడా స్వయంగా యేసుతో వ్యవహరిస్తున్నట్లే వ్యవహరించాల్సిన ప్రాముఖ్యతను యేసుక్రీస్తు తన అనుచరులకు చూపించాడు. “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితి[రి]” అని ఆయన అన్నాడు. (మత్తయి 25:​40) లోకం మనలను ఎలా దృష్టించినప్పటికీ, మనం సత్యాన్ని ప్రేమిస్తే మనం దేవుని దృష్టిలో ప్రత్యేకమైనవారిగా ఉంటాము.

ఫ్రాన్సీస్కూ * అనే తండ్రిలేని బ్రెజీలియన్‌ అబ్బాయి దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకున్న తర్వాత అలాగే భావించాడు. “యెహోవా గురించి ఆయన సంస్థ గురించి తెలుసుకోవడం నాలోని అభద్రతా భావాలను, బిడియాన్ని అధిగమించడానికి సహాయపడింది. యెహోవాకు మనలో ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత ఆసక్తి ఉందని నేను తెలుసుకున్నాను” అని ఆయన వివరిస్తున్నాడు. ఆయనకు యెహోవా నిజమైన తండ్రి అయ్యాడు.

యౌవనులపై శ్రద్ధ

యెహోవా యౌవనులపై ఒక గుంపుగా మాత్రమే కాక వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై కూడా యథార్థమైన ఆసక్తి చూపిస్తాడు. అయితే మనం యౌవనులమైనా లేక వృద్ధులమైనా మనం వాస్తవంగా ఉన్నదానికంటే మనమేదో అధికులమన్నట్లు భావించాలనుకోము. దేవుడు భవిష్యత్తులో ఉపయోగించుకోగల నైపుణ్యాలు, గుణాలు మనకు ఉండవచ్చు. మన నైపుణ్యాలను, గుణాలను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి మనం ఎలాంటి మార్పులను చేసుకోవలసిన అవసరం ఉందో మనకు ఎలాంటి శిక్షణ అవసరమో యెహోవాకు తెలుసు. ఉదాహరణకు, 1 సమూయేలు 16వ అధ్యాయంలోని వృత్తాంతాన్ని పరిశీలించండి. ఇశ్రాయేలుకు రాజవడానికి దావీదు కంటే ఇతర సభ్యులకు ఎక్కువ అర్హతలున్నట్లు సమూయేలు ప్రవక్త భావించాడు కాబట్టి, యెష్షయి చిన్న కుమారుడు దావీదును ఇశ్రాయేలుకు భావి రాజుగా తాను ఎంపిక చేసుకోవడానికిగల కారణాలను యెహోవా ఇలా వివరించాడు: “అతని [దావీదు అన్న] రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”​—⁠1 సమూయేలు 16:⁠7.

యెహోవాకు తమపై యథార్థమైన శ్రద్ధ ఉందని నేటి యౌవనులు నిశ్చయత కలిగి ఉండవచ్చా? ఆనా అనే బ్రెజీలియన్‌ యువతి విషయం ఆలోచించండి. అనేకమంది యౌవనుల్లాగే ఆమె కూడా అవినీతి, అన్యాయం చూసి కలత చెందింది. అప్పుడు ఆమె తండ్రి ఆమెను, ఆమె చెల్లెళ్ళను క్రైస్తవ కూటాలకు తీసుకువెళ్ళడం ప్రారంభించాడు. కొంతకాలానికి, ఆమె దేవుని వాక్యం గురించి తాను నేర్చుకుంటున్న విషయాల్లో ఆసక్తి చూపించడం ప్రారంభించింది. ఆనా క్రైస్తవ ప్రచురణలతోపాటు బైబిలు చదవడం, యెహోవా దేవునికి ప్రార్థించడం ప్రారంభించింది. క్రమంగా, ఆమె దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకొంది. “అందమైన సూర్యాస్తమయాలను చూసేందుకు మా ఇంటి దగ్గరున్న కొండపైకి సైకిలు మీద వెళ్ళడం నాకు ఎంతో ఇష్టం. నేను యెహోవాకు ప్రార్థించి ఆయనను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఆయన దయకు, ఉదారతకు కృతజ్ఞతలు తెలియజేసేదాన్ని. యెహోవా దేవుని గురించి ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవడం నాకు మనశ్శాంతినీ భద్రతా భావాన్ని ఇచ్చింది” అని ఆమె వివరిస్తోంది. యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ గురించి ధ్యానించడానికి మీరు కూడా సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తారా?

నిజమే, మనకు నేపథ్యంవల్ల మనం యెహోవాతో సన్నిహిత సంబంధం కలిగివుండడం కష్టంగా ఉండవచ్చు. లిడియా ఉదాహరణను గమనించండి. వ్యక్తిగతంగా తనను ఎంతో కలతపెడుతున్న ఒక విషయం గురించి తన తండ్రితో మనసు విప్పి మాట్లాడినప్పుడు ఆయన “నాన్సెన్స్‌” అని కొట్టిపారేశాడు. ఆ సమస్య గురించి తాను మరచిపోవాలని తన తండ్రి కోరుకుంటున్నాడు అని ఆమెకు అర్థమయినప్పటికీ లిడియా ఇలా చెబుతోంది: “బైబిలును అధ్యయనం చేయడంవల్ల నేను కోరుకున్నదంతా, దానికంటే ఎక్కువే నాకు లభించింది. యెహోవా దేవుని ఆకర్షణీయమైన వ్యక్తిత్వంవల్ల ఆయన నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఇప్పుడు నన్ను అర్థం చేసుకొనే ప్రేమగల తండ్రి నాకు ఉన్నాడు, ఆయనకు నేను నా భావాలను నా అంతరంగంలోని భయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు. నేను చెప్పేది తప్పకుండా వింటాడనే నమ్మకంతో నేను విశ్వంలోని అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తితో గంటల తరబడి మాట్లాడవచ్చు.” యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను అనుభవించేందుకు ఆమెకు ఫిలిప్పీయులు 4:6, 7 వంటి బైబిలు లేఖనాలు సహాయపడ్డాయి. ఆ వచనాల్లో ఇలా ఉంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”

మీ అవసరాలను తీర్చుకోవడానికి సహాయం

యెహోవా తన సేవకులలో ఒక్కొక్కరిపై అలాగే ఒక ప్రపంచవ్యాప్త సంఘంగా వారందరిపై శ్రద్ధ చూపిస్తాడు. మనం మన పరలోక తండ్రితో మాట్లాడేందుకు సమయం వెచ్చించడం ద్వారా ఆయనపట్ల మనకున్న ప్రేమను ప్రదర్శించవచ్చు. ఆయనతో మన సంబంధాన్ని ఎన్నడూ తేలికగా చూడకూడదు. దావీదు ఎల్లప్పుడూ యెహోవాతో తన సంబంధం గురించి ఆలోచించేవాడు. “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను” అని ఆయన అన్నాడు.​—⁠కీర్తన 25:4, 5.

దేవునితో సన్నిహిత సంబంధం అనే తలంపు మీకు కొత్తగా అనిపించవచ్చు. మీకు ఏ సమస్యలున్నప్పటికీ సర్వోన్నతుడైన దేవుడు తన చిత్తానికి అనుగుణంగా మీకు సహాయం చేయగలడని మీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు. (1 యోహాను 5:​14, 15) కాబట్టి, మీ పరిస్థితులను మీ అవసరాలను పరిగణలోకి తీసుకొని నిర్దిష్టమైన రీతిలో ప్రార్థించడం నేర్చుకోండి.

ఆలయం ప్రతిష్ఠించబడినప్పుడు సొలొమోను రాజు చేసిన ప్రార్థనలో, మన అవసరాలను గుర్తించవలసిన ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది: “దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, . . . చేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు . . . ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి . . . నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక.” (2 దినవృత్తాంతములు 6:​28-31) అవును, మీరు ‘అనుభవించే నొప్పి కష్టము’ కేవలం మీకే తెలుసు. అందుకే మీ నిజమైన అవసరాలను, కోరికలను తెలియజేయడం ఎంతో ప్రాముఖ్యం. మీరలా చేస్తే ‘యెహోవా మీ హృదయవాంఛలను తీరుస్తాడు.’​—⁠కీర్తన 37:⁠4.

యెహోవాతో మీ సంబంధాన్ని బలపరచుకోండి

సాధారణ ప్రజలు తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండేందుకు యెహోవా సంతోషంగా అనుమతిస్తున్నాడు. “మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు” అని ఆయన వాక్యం మనకు హామీ ఇస్తోంది. (2 కొరింథీయులు 6:​18) అవును, యెహోవా ఆయన కుమారుడు మనం విజయం సాధించి నిత్యజీవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. కుటుంబంలో, ఉద్యోగస్థలంలో, క్రైస్తవ సంఘంలో మన బాధ్యతలను నెరవేర్చడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడని తెలుసుకోవడం ఎంతటి ప్రోత్సాహాన్నిస్తుందో కదా!

అయినప్పటికీ మనందరం కష్ట సమయాలను ఎదుర్కొంటాము. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, తక్కువ ఆదాయం, లేదా ఇతర విషయాలు మనలను బాధించవచ్చు. ఒక పరీక్షతో లేదా కష్టంతో ఎలా వ్యవహరించాలో మనకు తెలియకపోవచ్చు. అంతకంతకు పెరిగిపోతున్న ఒత్తిళ్ళు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్న దుష్ట ఆరోపకుడైన అపవాదియగు సాతాను మూలంగానే కలుగుతున్నాయి. అయితే మనలను అర్థం చేసుకొని, మనం యెహోవాతో మంచి సంబంధాన్ని కాపాడుకునేందుకు మనకు సహాయం చేసే వ్యక్తి ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్న యేసుక్రీస్తే. “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” అని మనం చదువుతాము.​—⁠హెబ్రీయులు 4:15, 16.

దేవుని అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రఖ్యాతిగల ప్రజలుగా లేదా ధనవంతులుగా ఉండనవసరం లేదని తెలుసుకోవడం ఎంతటి ప్రోత్సాహాన్నిస్తుందో కదా! మీరు బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, “నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే” అని ప్రార్థించిన కీర్తనకర్త వలే ఉండండి. (కీర్తన 31:9-14; 40:​17) యెహోవా వినయస్థులైన సాధారణ ప్రజలను ప్రేమిస్తాడని నిశ్చయత కలిగి ఉండండి. నిజమే ‘ఆయన మన గురించి చింతించుచున్నాడు గనుక మన చింత యావత్తు ఆయనమీద వేయవచ్చు.’​—⁠1 పేతురు 5:⁠7.

[అధస్సూచి]

^ పేరా 10 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[29వ పేజీలోని చిత్రాలు]

యేసు అనుచరులలో చాలామంది విద్యలేని పామరులు

[30వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు బలమైన విశ్వాసం పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు

[31వ పేజీలోని చిత్రాలు]

దేవుని అనుగ్రహం పొందడానికి మనం ప్రాముఖ్యమైన వారిగా ఉండనవసరం లేదు